నీటి కాలుష్యం

నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శుద్ధి చేయని మురుగునీటిని సహజ జలాల్లోకి విడుదల చేయడం జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటిపి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటిపారుదల కొరకు ఉపయోగించవచ్చు . ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకూ నీటి కాలుష్యం ప్రధాన కారణం. [1] [2]

కెనడాలోని లాచైన్ కాలువలో కాలుష్యం

సముద్ర కాలుష్యం, పోషకాల కాలుష్యం నీటి కాలుష్యంలోని ఉపసమితులు. నీటి కాలుష్యానికి కారణమయ్యే మూలాలు ఒక్క చోటనే (ఏకమూలం) ఉండవచ్చు, లేదా పలు చోట్ల ఉండే మూలాలూ (అనేక మూలాలు) కావచ్చు. వరద నీటి కాలువ, మురుగునీటి శుద్ధి కర్మాగారం లేదా వాగు వంటివి ఏక మూల కాలుష్య కారకాలు. వ్యవసాయ మురుగు నీరు వంటివి అనేక మూలాలు కలిగినవి (ఏక మూలం కాని, చాలా విస్తరమైన ప్రదేశంలో విస్తరించి ఉండే మూలాలు). [3] కాలుష్యం అనేది కాలక్రమంలో జరిగే సంచిత ప్రభావం యొక్క ఫలితం. కలుషితమైన నీటి వనరులలో నివసించే లేదా ఆ నీటిని గ్రహించే మొక్కలు, జీవులు అన్నీ ప్రభావితమవుతాయి.ప్రభావాలు జాతులను దెబ్బతీస్తాయి. వాటిపై ఆధారపడిన సహజ జీవ సమాజాలను కూడా ప్రభావితం చేస్తాయి.

భౌతిక పరామితులతో పాటు అనేక రసాయనాలు, వ్యాధికారక పదార్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణాలు. కాలుష్య కారకాల్లో సేంద్రియ (కర్బన), నిరింద్రియ (అకర్బన) పదార్థాలు రెండూ ఉంటాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా నీటి కాలుష్యానికి దారితీస్తాయి. విద్యుత్ కేంద్రాలు, పారిశ్రమలూ నీటిని శీతలీకరణిగా ఉపయోగించడం ఉష్ణ కాలుష్యానికి ఒక సాధారణ కారణం. అధిక ఉష్ణోగ్రతలు నీటిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గించి, చేపల మరణానికి కారణమౌతాయి. దీనివల ఆహారపు గొలుసు కూర్పు మారుతుంది, జాతుల జీవవైవిధ్యం తగ్గుతుంది, కొత్త థర్మోఫిలిక్ జాతులు వృద్ధి చెంది ఇతర జీవుల స్థానాన్ని ఆక్రమిస్తాయి. [4] [5] : 375 

నీటి నమూనాలను విశ్లేషించడం ద్వారా నీటి కాలుష్యాన్ని కొలుస్తారు. ఈ విశ్లేషణలో భాగంగా శారీరక, రసాయన, జీవ పరీక్షలు చేయవచ్చు. నీటి కాలుష్య నియంత్రణకు సరైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ ప్రణాళికలూ అవసరం. మౌలిక సదుపాయాలలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఒక భాగం. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, పారిశ్రామిక మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నీటి వనరులను మురుగునీటి నుండి రక్షిస్తాయి. వ్యవసాయ మురుగునీటి శుద్ధి, నిర్మాణ స్థలాల్లో కోత నియంత్రణ కూడా నీటి కాలుష్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నీటి కాలుష్యాన్ని నివారించడంలో మరొక విధానం ప్రకృతి ఆధారిత పరిష్కారాలు. [6] పట్టణ ప్రాంతాల్లో నీటి ప్రవాహం వేగాన్ని, పరిమాణాన్నీ నియంత్రించడం ఒక పద్ధతి. అమెరికాలో, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు నీటి పరిమాణాన్ని తగ్గించడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం చేస్తారు. [7]

రకాలు మార్చు

100 గ్రాముల ప్రోటీన్‌ ఉండే వేర్వేరు ఆహార పదార్థాల తయారీలో యూట్రోఫింగ్ ఉద్గారాలు (నీటి కాలుష్యం)[8]
ఆహార రకాలుEutrophying Emissions (g PO43-eq per 100g protein)
ఆవు, గేదె మాంసం
365.3
చేపలు
235.1
పీత,ఎండ్రకాయ
227.2
వెన్న
98.4
గొర్రె, మేక
97.1
పంది మాంసం
76.4
కోడి మాంసం
48.7
కోడిగుడ్లు
21.8
వేరుశనగ
14.1
బఠాణీ
7.5
టోఫు
6.2

ఉపరితల నీటి కాలుష్యం మార్చు

నదులు, సరస్సులు, మహాసముద్రాల్లో ఏర్పడే కాలుష్యం ఉపరితల నీటి కాలుష్యంలో భాగం.

సముద్ర కాలుష్యం మార్చు

ఈ నది ఆంగ్లేసీలో మూసేసిన రాగి గని నుండి కలుషితాలను మోసుకుపోతుంది

సముద్రంలోకి సాధారణంగా నదుల ద్వారా కాలుష్యం చేరుతుంది. మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడుదల చేయడానికి నదులొక మార్గం. ఈ కాలుష్యం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు ప్లాస్టిక్ కాలుష్యానికి 10 అతిపెద్ద కారక దేశాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక, థాయిలాండ్, ఈజిప్ట్, మలేషియా, నైజీరియా, బంగ్లాదేశ్ లు. [9] ఎక్కువగా యాంగ్జీ, సింధు, యెల్లో, హై, నైలు, గంగ, పెర్ల్, అముర్, నైగర్, మెకాంగ్ నదుల ద్వారా ఈ కాలుష్యం సందురాల్లోకి చేరుతోంది. "సముద్రాల్లోకి చేరే మొత్తం ప్లాస్టిక్‌లలో 90 శాతం" వాటా ఈ 10 దేశాలదే. [10] [11]

మహాసముద్రాలలో ఉండే పెద్ద సుడిగుండాలు ఈ తేలియాడే ప్లాస్టిక్ శిథిలాలను సంగ్రహిస్తాయి. ప్లాస్టిక్ శిథిలాలు సముద్రాల్లో ఉండే విష రసాయనాలను గ్రహిస్తాయి. వాటిని తినే ఏ జీవి అయినా విషపూరిత మౌతుంది. [12] దీర్ఘకాలం పాటు ఉండే ఈ ప్లాస్టిక్ ముక్కలు సముద్ర పక్షులు, జంతువుల కడుపులో చేరుతాయి. ఇది జీర్ణ వ్యవస్థలకు ఆటంకం కలిగించి, ఆహారేచ్ఛ తగ్గిపోవడానికి, ఆకలితో అలమటించడానికీ దారితీస్తుంది. అసలు కాలుష్య కారకం నుండి కాకుండా, తదుత్పన్నాల వలన అనేక రకాల ద్వితీయ స్థాయి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఒండ్రుతో కూడిన ఉపరితల ప్రవాహం దీనికి ఒక ఉదాహరణ. నీటి గుండా సూర్యరశ్మి చొచ్చుకుపోవడానికి ఈ ఒండ్రు, అడ్డుపడుతుంది. దీంతో నీటి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలుగుతుంది.

భూగర్భజల కాలుష్యం మార్చు

భూగర్భజలాలు, ఉపరితల జలాల మధ్య పరస్పర చర్యలు సంక్లిష్టంగా ఉంటాయి. పర్యవసానంగా, భూగర్భజల కాలుష్యాన్ని ఉపరితల నీటి కాలుష్యం లాగా సులభంగా వర్గీకరించడం వీలవదు. [13] దాని స్వభావం కారణంగా, భూగర్భజలాలు ఉపరితల జలాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయని వనరుల వలన కలుషితమౌతాయి. భూగర్భ జలాలకు సంబంధించి ఏక మూల, బహు మూల కాలుష్య కారకాల మధ్య తేడా ఉండదు.

భూగర్భజల కాలుష్యానికి కారణాలు: భూమి లోపల సహజంగా సంభవించేవి, పారిశుద్ధ్య వ్యవస్థలు, మురుగునీరు, ఎరువులు, పురుగు మందులు, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాల లీకులు, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్, ల్యాండ్‌ఫిల్ లీచేట్.

కాలుష్య వనరుల వర్గాలు మార్చు

ఉపరితల జలాలు, భూగర్భజలాలు పరస్పరం సంబంధం కలిగి ఉన్నప్పటికీ వాటిని అధ్యయనం చేసి వేరువేరు వనరులుగా నిర్వహిస్తారు. [13] ఉపరితలంపై ఉన్న నీరు నేల గుండా వెళ్లి భూగర్భజలంగా మారుతుంది. దీనికి విరుద్ధంగా, భూగర్భజలాలు ఉపరితల నీటి వనరులను కూడా పోషించగలవు. ఉపరితల నీటి కాలుష్య కారకాలను సాధారణంగా వాటి మూలం ఆధారంగా రెండు విధాలుగా వర్గీకరిస్తారు.

ఏక మూలాలు మార్చు

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలోని షిప్‌యార్డ్‌లో పాయింట్ సోర్స్ కాలుష్యం.

పైపు లేదా గుంట లాంటి ఒకే మూలం నుండి జలమార్గంలోకి ప్రవేశించే కలుషితాలను ఏక మూల కాలుష్య వనరు అంటారు. వీటికి ఉదాహరణలు మురుగునీటి శుద్ధి ప్లాంటు, కర్మాగారం లేదా పట్టణాల్లోని వరద కాలువలు.

అనేక (విస్తృత) కాలుష్య మూలాలు మార్చు

ఒకే వివిక్త మూలం నుండి కాకుండా అనేక మూలాల నుండి ఉద్భవించే కాలుష్యం ఇది. విస్తారమైన ప్రాంతం నుండి చిన్న చిన్న పరిమాణాల్లో కాలుష్యాలు కలిసి ఈ రకమైన కాలుష్యం ఏర్పడుతుంది. ఎరువులు వాడిన పొలాల నుండి నత్రజని సమ్మేళనాలు బయటకు రావడం దీనికొక ఉదాహరణ. [3] పొలాలు లేదా అటవీప్రాంతం గుండా వరద నీరు ప్రవహించి పోషకాలు కొట్టుకు పోవడం కూడా ఇంకొక ఉదాహరణ.

పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు, రోడ్లు, రహదారుల నుండి వర్షపు నీటితో కొట్టుకువచ్చే చెత్తకూడా కొన్నిసార్లు అనేక మూలాల కాలుష్యం గానే పరిగణిస్తారు. ఈ ప్రవాహాలు వరద నీటి కాలువల్లోకి ప్రవహించడం ద్వారా గానీ, పైపుల ద్వారా స్థానిక ఉపరితల జలాల్లోకి విడుదల అవడం ద్వారా గానీ ఏకమూల కాలుష్య వనరుగా మారతాయి.

కాలుష్యాలు, వాటి మూలాలు మార్చు

నీటి వనరుల కాలుష్యానికి దారితీసే మానవ కార్యకలాపాల గురించి దక్షిణ ఆసియాలో ప్రజలకు బోధించడానికి పోస్టర్

నీటి కాలుష్యానికి దారితీసే నిర్దుష్ట కారకాలలో రసాయనాలు, వ్యాధి కారకాలతో పాటు, అధిక ఉష్ణోగ్రత, రంగు వెలిసిపోవడం వంటి భౌతిక మార్పులూ ఉన్నాయి. రసాయనాల్లో చాలా వరకు ( కాల్షియం, సోడియం, ఇనుము, మాంగనీస్ మొదలైనవి) సహజంగా కూడా నీటిలో కలిసి ఉంటాయి. అయితే, ఏది సహజ లక్షణమో ఏది కాలుష్యమో అనేది నీటిలో వీటి గాఢత ఎంత ఉంది అనేది నిర్ణయిస్తుంది. సహజంగా నీటిలో ఉండే పదార్థాల గాఢత పెరిగినపుడు నీటిలో పెరిగే వృక్ష, జంతుజాలాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.

ఆక్సిజన్ను క్షీణింపజేసే పదార్థాల్లో ఆకులు, గడ్డి వంటి ప్రకృతి సహజ పదార్థాలే కాకుండా, మానవనిర్మిత రసాయనాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రకృతి సహజ, మానవజనిత పదార్థాల వలన నీరు మడ్డిగా మారి సూర్యకాంతిని చొరనీయకుండా చేసి, మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. అలాగే కొన్ని చేప జాతుల మొప్పలను మూసేస్తాయి. [14]

కాలుష్యం వలన నీటిలో ఆమ్లత్వం (పిహెచ్‌లో మార్పు), విద్యుద్వాహకత, ఉష్ణోగ్రత, యూట్రోఫికేషన్ వంటి భౌతిక రసాయనిక లక్షణాల్లో మార్పులు జరుగుతాయి. యూట్రోఫికేషన్ అనేది పర్యావరణ వ్యవస్థలో రసాయన పోషకాల సాంద్రతను పెంచి పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాథమిక ఉత్పాదకతను పెంచడం. యూట్రోఫికేషన్ స్థాయిని బట్టి, అనాక్సియా (ఆక్సిజన్ క్షీణత), నీటి నాణ్యతలో తీవ్రమైన తగ్గుదల వంటి ప్రతికూల పర్యావరణ ప్రభావాలు ఏర్పడతాయి. చేపలు, ఇతర జీవుల జనాభాను ప్రభావితం చేస్తాయి.

రోగకారక క్రిములు మార్చు

మ్యాన్‌హోల్ కవర్ సానిటరీ మురుగు ఓవర్‌ఫ్లో కలిగి ఉండలేకపోయింది.
కెన్యాలోని నైరోబిలోని కొరోగోచో మురికివాడ వద్ద పిట్ లాట్రిన్ల నుండి సేకరించిన మల బురదను నదిలోకి పోస్తారు.

వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను వ్యాధికారకాలు అంటారు. వ్యాధి కారక క్రిములు మానవుల లేదా జంతువులలో నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలిగిస్తాయి. [3] వ్యాధికి అసలు కారణం కాని కోలిఫాం బ్యాక్టీరియాను సాధారణంగా నీటి కాలుష్యపు బ్యాక్టీరియా సూచికగా ఉపయోగిస్తారు. కలుషిత ఉపరితల జలాల్లో కనిపించే, మానవ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఇతర సూక్ష్మజీవులు:

  • బుర్ఖోల్డెరియా సూడోమల్లె
  • క్రిప్టోస్పోరిడియం పర్వం
  • గియార్డియా లాంబ్లియా
  • సాల్మోనెల్లా
  • నోరోవైరస్ తదితర వైరస్లు
  • స్కిస్టోసోమా రకం [15] [16] సహా పరాన్నజీవి పురుగులు

ఆన్-సైట్ పారిశుధ్య వ్యవస్థలు (సెప్టిక్ ట్యాంకులు, పిట్ లాట్రిన్లు) లేదా తగినంతగా శుద్ధి చేయని మురుగునీటి వలన అధిక స్థాయిలో వ్యాధికారకాలు సంభవించవచ్చు. [17] కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు ఉన్న పాత నగరాల్లో మురుగునీటి సేకరణ వ్యవస్థలు (పైపులు, పంపులు, కవాటాలు) లీకౌతూ ఉండవచ్చు. వీటి నుండి మురుగునీరు బయటికి ప్రవాహిస్తుంది. కొన్ని నగరాల్లో మురుగునీటికి వర్షపు నీటికీ ఒకే కాలువలు ఉన్నాయి. వర్షాలు ముంచెత్తిన సమయంలో వీటి నుండి శుద్ధి చేయని మురుగునీరు బయటికి పొర్లుతుంది. [18] మురుగునీటిలో కొట్టుకువచ్చే సిల్ట్ (అవక్షేపం) కూడా నీటి వనరులను కలుషితం చేస్తుంది.

బురద నది అవక్షేపంతో కలుషితమైంది.

పశువుల చావిళ్ళ వద్ద మురికినీటిని సరిగా మళ్ళించకపోయినా వ్యాధికారకాలు ఉత్పత్తి అవుతాయి.

సేంద్రియ, నిరింద్రియ, స్థూల కలుషితాలు మార్చు

కలుషితాలలో సేంద్రియ, నిరింద్రియ పదార్థాలు ఉండవచ్చు. రసాయన పదార్థాల్లో చాలావరకూ విషపూరితమైనవి . [5] : 229 

న్యూజిలాండ్‌, ఆక్లాండ్‌లోని పట్టణ ప్రాంత ప్రవాహంలో చెత్త సేకరణ స్థలం.

సేంద్రియ నీటి కాలుష్య కారకాలు:

  • డిటర్జెంట్లు
  • క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసిన తాగునీటిలో కనిపించే క్లోరోఫారమ్ వంటి ఉప-ఉత్పత్తులు
  • ఫుడ్ ప్రాసెసింగ్ వ్యర్థాలు, ఇందులో ఆక్సిజన్‌ను పీల్చుకునే కొవ్వులు, గ్రీజులు ఉంటాయి
  • పురుగుమందులు, కలుపు సంహారకాలు, ఆర్గానోహాలైడ్లు, ఇతర రసాయన సమ్మేళనాలు
  • వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే పెట్రోలియం హైడ్రోకార్బన్లు, ఇంధనాలు ( గ్యాసోలిన్, డీజిల్ ఇంధనం, జెట్ ఇంధనాలు, ఇంధన చమురు ), కందెనలు (మోటారు చమురు), ఇంధన దహనం కారణంగా వెలువడే ఉప ఉత్పత్తులు [19]
  • పారిశ్రామిక ద్రావకాల వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలను సరిగా నిల్వ చేయనపుడు
  • క్లోరినేటెడ్ ద్రావకాల వంటి ద్రవరూపంలో ఉండని పదార్థాలు నీటిలో కరగవు, నీటికంటే సాంద్రంగా ఉంటాయి. అందుచేత ఇవి జలాశయాల అడుక్కు చేరుతాయి.
    • పాలిక్లోరినేటెడ్ బైఫెనిల్ (పిసిబిలు)
    • ట్రైక్లోరోఎథిలిన్
  • పెరాక్లోరైడ్
  • వ్యక్తిగత పరిశుభ్రత, సౌందర్య ఉత్పత్తులలో ఉండే వివిధ రసాయన సమ్మేళనాలు
  • యాంటిడిప్రెసెంట్ మందులు లేదా గర్భనిరోధక మాత్రలు వంటి హార్మోన్ల మందులు. ఈ మోలిక్యూళ్ళు చిన్నవిగా ఉంటాయి. ఖరీదైన యంత్రాలు, శుద్ధి పద్ధతులూ లేకుండా శుద్ధి కేంద్రాల్లో వీటిని తొలగించడం కష్టం. [20]
పార్కుల్లో స్థూల కాలుష్య వస్తువులు మిల్వాకీ, అమెరికా

నిరింద్రియ నీటి కాలుష్య కారకాలు:

  • పారిశ్రామిక ఉత్సర్గాల వలన కలిగే ఆమ్లత్వం (ముఖ్యంగా విద్యుత్ ప్లాంట్ల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ )
  • ఆహార ప్రాసెసింగ్ వ్యర్థాల నుండి వెలువడే అమ్మోనియా
  • పారిశ్రామిక ఉప-ఉత్పత్తులుగా బయటికి వచ్చే రసాయన వ్యర్థాలు
  • పోషకాలను కలిగి ఉన్న ఎరువులు - నైట్రేట్లు, ఫాస్ఫేట్లు - పొలాల నుండి నీటి ప్రవాహంలో, అలాగే వాణిజ్య, గృహ వాడకాల్లో ఇవి కనిపిస్తాయి [19]
  • మోటారు వాహనాల నుండి భారీ లోహాలు (పట్టణ వర్షపు నీటి ప్రవాహం ద్వారా), [19] [21] గనుల నుండి పారే ఆమ్లాలు
  • జల పర్యావరణ వ్యవస్థలోకి క్రియోసోట్ సంరక్షణకారి కలవడం
  • నిర్మాణ స్థలాలు, చెట్లు కొట్టే స్థలాలు, పోడు వ్యవసాయం కోసం చెట్లను తగలబెట్టే స్థలాల నుండి నీటిలో కొట్టుకు పోయే సిల్ట్ (అవక్షేపం)

స్థూల (మాక్రోస్కోపిక్) కాలుష్యం   - నీటిని కలుషితం చేసే పెద్ద వస్తువులు   - పట్టణ వరద నీటిలో "తేలుతూ" కనిపిస్తాయి. ఇవి సముద్రాలలో కనిపించినప్పుడు సముద్రపు చెత్త అని పిలుస్తారు. వీటిలో కింది వాటిని చేర్చవచ్చు :

  • చెత్త (ఉదా. కాగితం, ప్లాస్టిక్ లేదా ఆహార వ్యర్థాలు), ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా చెత్తను వేయడంతో, వర్షం ద్వారా వరద కాలువల్లోకి వెళ్ళి, చివరికి ఉపరితల జలాల్లోకి విడుదలవుతాయి.
  • నర్డిల్స్, నీటిలో సర్వత్రా ఉండే ప్లాస్టిక్ గుళికలు. చూడండి ప్లాస్టిక్ కాలుష్యం, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం.
  • షిప్‌రెక్స్, పెద్ద విడదీయబడిన ఓడలు.
మసాచుసెట్స్‌లోని బ్రైటన్ పాయింట్ పవర్ స్టేషన్ వేడి నీటిని మౌంట్ హోప్ బే లోకి విడుదల చేస్తుంది .

ఉష్ణోగ్రతలో మార్పు మార్చు

ఉష్ణ కాలుష్యం అంటే మానవ ప్రభావం వల్ల సహజ జలాశయాల్లోని నీటి ఉష్ణోగ్రత పెరగడం లేదా తగ్గడం. ఉష్ణ కాలుష్యం, రసాయన కాలుష్యం లాగా కాకుండా, నీటి భౌతిక లక్షణాలలో మార్పుకు దారితీస్తుంది. ఉష్ణ కాలుష్యానికి ఒక సాధారణ కారణం విద్యుత్ ప్లాంట్లు, తయారీ పరిశ్రమల్లో నీటిని శీతలీకరణిగా ఉపయోగించడం. అధిక ఉష్ణోగ్రతలు నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వలన చేపలను మరణిస్తాయి. దీంతో ఆహార గొలుసు కూర్పు మారుతుంది, జాతుల జీవవైవిధ్యం తగ్గుతుంది. కొత్త థర్మోఫిలిక్ జాతులు వీటి స్థానాన్ని ఆక్రమిస్తాయి . [4] [22] [5] : 375  పట్టణ ప్రవాహాల వలన కూడా ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. [23]

జలాశయాల అడుగు నుండి చాలా చల్లటి నీరు వెచ్చని నదులలోకి ప్రవహిండం వల్ల కూడా ఉష్ణ కాలుష్యం సంభవిస్తుంది.

కాలుష్య నియంత్రణ మార్చు

మునిసిపల్ మురుగునీటి శుద్ధి మార్చు

బోస్టన్, మసాచుసెట్స్ పరిసరాల్లో పనిచేస్తున్న డీర్ ఐలాండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ .
పారిశ్రామిక మురుగునీటిని శుద్ధి చేయడానికి కరిగించిన ఎయిర్ ఫ్లోటేషన్ వ్యవస్థ.
అయోవాలో ఒక వాగు వెంట ఉన్న రియోరియన్ బఫర్

అభివృద్ధి చెందిన దేశాల పట్టణ ప్రాంతాల్లో, మునిసిపల్ మురికినీటిని (లేదా మురుగునీటిని) కేంద్రీకృత మురుగునీటి శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేస్తారు. సరిగా రూపొందించి, పనిచేయించే వ్యవస్థలు (అనగా ద్వితీయ స్థాయి శుద్ధి లేదా మరింత అధునాతన పద్ధతులతో) మురుగునీటిలో కాలుష్యాన్ని 90 శాతానికి పైనే తొలగించగలవు. [24] కొన్ని కర్మాగారాల్లో పోషకాలు, వ్యాధికారక కణాలను తొలగించడానికి అదనపు వ్యవస్థలు ఉంటాయి. అయితే ఈ శుద్ధి వ్యవస్థలు అధునాతనమైనవి అయ్యే కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది.

కేంద్రీకృత శుద్ధి కర్మాగారాలకు బదులుగా (లేదా వాటితో అనుబంధంగా) ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగిస్తున్నారు. [6]

శానిటరీ మురుగునీటి ప్రవాహాలు లేదా మిశ్రమ మురుగునీటి ప్రవాహాలు ఉన్న నగరాల్లో శుద్ధి చేయని మురుగునీటిని విడుదల చేయడం తగ్గించడానికి ఇంజనీరింగ్ విధానాలను ఉపయోగిస్తున్నారు:

  • వ్యవస్థ అంతటా వర్షపు నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికీ, ట్రీట్‌మెంట్ ప్లాంట్ యొక్క హైడ్రాలిక్ ఓవర్‌లోడింగ్‌ను తగ్గించడానికీ హరిత మౌలిక సదుపాయాల విధానాన్ని ఉపయోగించడం [25]
  • కారుతున్న, పనిచేయని పరికరాలను మరమ్మత్తు చేయడం, మార్చేయడం [18]
  • మురుగునీటి సేకరణ వ్యవస్థ హైడ్రాలిక్ సామర్థ్యాన్ని పెంచడం (చాలా ఖర్చుతో కూడుకున్నది).

ఆన్-సైట్ పారిశుధ్యం, సురక్షితంగా నిర్వహించే పారిశుధ్యం మార్చు

మునిసిపల్ శుద్ధి కర్మాగారాలకు అనుసంధానమై లేని గృహాలు లేదా వ్యాపార కేంద్రాల్లో వ్యక్తిగత సెప్టిక్ ట్యాంకులు పెట్టాలి. ఇవి సైట్‌లోనే కాలుష్యాలను వడపోసి, మట్టిలోకి ఇంకేలా చేస్తాయి. సరిగ్గా చేయకపోతే ఇవి భూగర్భజల కాలుష్యానికి దారితీస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమం వారి అంచనా ప్రకారం, 2017 లో సుమారు 450 కోట్ల మంది ప్రజలకు సురక్షిత పారిశుద్ధ్య వ్యవస్థ లేదు. [26] పారిశుద్ధ్య వ్యవస్థ అందుబాటులో లేని చోట్ల తరచుగా నీరు కలుషితమౌతూ ఉంటుంది. ఉదా. బహిరంగ మలవిసర్జన. వర్షాలు పడినపుడు, వరదలు వచ్చినపుడూ మానవ మలం ఉపరితల జలాల్లోకికొట్టుకు పోతుంది. మామూలు, తెరచి ఉండే లెట్రిన్ గుంటలు వర్షాలు పడినపుడూ ఉరకెత్తుతాయి. సురక్షిత పారిశుధ్య వ్యవస్థలను వాడడం ద్వారా ఈ రకమైన నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు. [26]

పారిశ్రామిక మురుగునీటి శుద్ధి మార్చు

కొన్ని పరిశ్రమలు గృహాల్లోని మురుగునీటి మాదిరిగానే వ్యర్థ జలాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని మురుగునీటి శుద్ధి కర్మాగారాల ద్వారా శుద్ధి చేయవచ్చు. సేంద్రియ పదార్థాలు (ఉదా. చమురు, గ్రీజు), కాలుష్య కారక విషాలు (ఉదా. భారీ లోహాలు, అస్థిర సేంద్రియ సమ్మేళనాలు) లేదా అమ్మోనియా వంటి పోషకాలతో వ్యర్థ జలాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రత్యేక శుద్ధి వ్యవస్థలు అవసరం. [27] : Ch. 16  కొన్ని పరిశ్రమలు కొన్ని కాలుష్య కారకాలను (ఉదా., విష సమ్మేళనాలు) తొలగించడానికి ప్రీ-ట్రీట్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆపై పాక్షికంగా శుద్ధి చేసిన మురుగునీటిని మునిసిపల్ మురుగునీటి వ్యవస్థకు విడుదల చేస్తాయి. [28] [29] : Ch. 1  పెద్ద మొత్తంలో మురుగునీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు సాధారణంగా తమ సొంత శుద్ధి వ్యవస్థలను నిర్వహిస్తాయి. కాలుష్య నివారణ అనే ప్రక్రియ ద్వారా కాలుష్య కారకాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి కొన్ని పరిశ్రమలు తమ తయారీ ప్రక్రియలను పునః రూపకల్పన చేయడంలో విజయవంతమయ్యాయి.

విద్యుత్ ప్లాంట్లలో ఇతర ఉత్పాదక కర్మాగారాల్లో ఉత్పన్నమయ్యే మురికినీటి నుండి ఉష్ణాన్ని తొలగించడానికి ఈ క్రింది సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు:

  • బాష్పీభవనం, ఉష్ణప్రసరణ, రేడియేషన్ ద్వారా నీటిని చల్లబరచేందుకు రూపొందించిన మానవ నిర్మిత చెరువులు
  • శీతలీకరణ టవర్లు, ఇవి ఆవిరి లేదా ఉష్ణ బదిలీ ద్వారా ఉష్ణాన్ని వాతావరణంలోకి బదిలీ చేస్తాయి
  • కోజెనరేషన్: గృహాల్లోను, పరిశ్రమల్లోనూ వేడి చేసే అవసరాల కోసం వ్యర్థాల్లోని ఉష్ణాన్ని రీసైకిల్ చేసే ప్రక్రియ. [30]

వ్యవసాయ మురుగునీటి శుద్ధి మార్చు

అనేక మూలాల నియంత్రణలు

అమెరికాలో[permanent dead link] ఫీడ్ లాట్

పొలాల నుండి కొట్టుకు వచ్చే అవక్షేపం (మట్టి ) అమెరికాలో వ్యవసాయ కాలుష్యానికి అతిపెద్ద మూలం. [14] పొలాల మీదుగా వెళ్ళే ప్రవాహాలను తగ్గించడానికి, పొలాలలో మట్టిని కొట్టుకుపోనీకుండా కాపాడుకోవటానికి రైతులు కోత నియంత్రణలను ఉపయోగిస్తారు. పొలం వాలుకు అడ్డంగా దున్నటం, పంటను కప్పడం, పంట మార్పిడి, శాశ్వత పంటలను నాటడం, వాగుల తీరం వెంబడి చెట్ల పెంపకం వంటివి సాధారణంగా వాడే పద్ధతులు. [31] [32] : pp. 4-95–4-96 

సాధారణంగా వాణిజ్య ఎరువులు, పశువుల ఎరువు లేదా మునిసిపల్ లేదా పారిశ్రామిక వ్యర్థజలాలు లేదా బురద మొదలైన రూపాల్లో పొలాలకు పోషకాలను (నత్రజని, భాస్వరం) అందజేస్తారు. పంట అవశేషాలు, నీటిపారుదల నీరు, వన్యప్రాణులు, వాతావరణ నిక్షేపణల ద్వారా ఈ పోషకాలు మురుగునీటి లోకి ప్రవేశిస్తాయి. [33] : p. 2–9  పోషకాలను అతిగా వాడకుండా రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించవచ్చు. [34] [33] : pp. 4-37–4-38  ఆ విధంగా, పోషకాల ద్వారా జైరిగే నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

పురుగుమందుల ప్రభావాలను తగ్గించడం కోసం, రసాయన పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడానికీ, నీటి నాణ్యతను కాపాడటానికీ రైతులు సమగ్ర క్రిమి నాశక పద్ధతులను (ఐపిఎం) అవలంబించవచ్చు. [35]

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

🔥 Top keywords: ఈనాడుఆంధ్రజ్యోతితెలుగుహనుమజ్జయంతిసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీవికీపీడియా:Contact usబంగారంఉపద్రష్ట సునీతప్రత్యేక:అన్వేషణహనుమంతుడువెంట్రుకగ్లోబల్ వార్మింగ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహనుమాన్ చాలీసాశ్రీలలిత (గాయని)జై శ్రీరామ్ (2013 సినిమా)పవన్ కళ్యాణ్అశ్వత్థామసలేశ్వరంతెలుగు అక్షరాలునక్షత్రం (జ్యోతిషం)యూట్యూబ్ఎస్. జానకిసుందర కాండఅనసూయ భరధ్వాజ్తెలుగు సినిమాలు 2024సప్త చిరంజీవులుశ్రీ గౌరి ప్రియయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరాశిప్రభాస్చరాస్తిగాయత్రీ మంత్రంతెలంగాణబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికొండా విశ్వేశ్వర్ రెడ్డి